తమిళనాడు ఎన్నికల బరిలో లేం: కమల్ హాసన్

  • డీఎంకే కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
  • సీట్ల సంఖ్య, గుర్తుపై అసంతృప్తితోనే ఈ నిర్ణయం
  • ఇది త్యాగం కాదు, కర్తవ్యం అంటున్న కమల్ హాసన్
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. చెన్నైలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో నిన్న భేటీ అయిన అనంతరం కమల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

సీట్ల పంపకాల చర్చల్లో డీఎంకే ప్రతిపాదించిన సీట్ల సంఖ్య తమకు ఆమోదయోగ్యం కాదని కమల్ తెలిపారు. అలాగే, తమ అభ్యర్థులను డీఎంకే 'ఉదయించే సూర్యుడు' గుర్తుపై పోటీ చేయాలన్న సూచనను కూడా అంగీకరించలేకపోయామని ఆయన వివరించారు. తమ పార్టీకి 'టార్చ్ లైట్' గుర్తు కేవలం ఒక చిహ్నం కాదని, అది తమ గుర్తింపు అని కమల్ పేర్కొన్నారు. మతతత్వ శక్తులు రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న ఈ తరుణంలో, మా నిర్ణయం త్యాగం కాదు, కర్తవ్యం. ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడమే మా లక్ష్యం అని కమల్ హాసన్ అన్నారు.

కాగా, కమల్ నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ స్వాగతించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమల్ గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని, చరిత్ర దీన్ని ప్రశంసిస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున కమల్ హాసన్ ప్రచారం చేయనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం పోటీ చేయకుండా డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
 

Kamal Haasan
Tamil Nadu Elections
MK Stalin
DMK alliance
Makkal Needhi Maiam
Dravidian Model 2.0
Tamil Nadu Politics
2026 Assembly Elections
Torch Light Symbol
Political Support

More Telugu News